" దొంగతనం నేర్పిన పాఠం " ************************ అది నేను 8.వ. తరగతి చదువుకుంటున్న రోజులు నాకు బాగా జ్ఞాపకం కూడా . మా ట్యూషన్ మాస్టారు పేరిసెట్ల.వేంకటెశ్వర్లు( పాపం) ఆ రోజుల్లో ముగ్గురు పిల్లలు భార్య, ఆయన సంసారం . అతను అప్పుడు ప్రైవేటుగా బి.ఏ రెండవసంవత్సరం చదువుకుంటున్నారు . వాళ్ళవృత్తి మగ్గం నేయడం . భార్యాభర్తలు ఇద్దరూ ఓ ప్రక్క బట్టలు నేస్తూ, మాష్టారు,తాను మాకు పాటలు చెప్పే వారు . ఇంగ్లీష్ గ్రామర్ నా తరగతి రీత్యా అవుసరం .తాను గ్రామర్ చాలా సున్నితం గ అర్ధం అయ్యేలా చెప్పేవారు . నాకు నా సహ విద్యార్థి కి గ్రామర్ పుస్తకం కావలిసివచ్చింది . మాష్టారు చెప్పే ఇంగ్లీషు గ్రామర్ అర్ధం సంపూర్ణం కావాలంటే ... హోంవర్క్ చేయాల్సి ఉంటుంది . అలాచేయాలంటే మాస్టారు చెప్పింది అర్ధం కావాలంటే తెలుగు లో ఇంగ్లీషు గ్రామర్ నేర్చుకోటానికి అద్భుతమైన ఆయుధం "j .v . రమణయ్య " గ్రామర్ అచ్చుపుస్తకం ఎంతగానో దోహద పడుతుంది . అప్పట్లో దాని ఖరీదు మూడు రూపాయల యాబై పైసలు మాత్రమే మాస్టారు గారి ట్యూషన్ ఫీజు ఐదు రూపాయలు (మీరు అర్ధం చేసుకోవచ్చు పుస్తకం ఖరీదు ఎంత భారమో సామాన్యులకు ).మాష్టారు ఒక్క మాంచి ఉపాయం చెప్పారు .నేను నా మిత్రుడు సుబ్బారావు చెరీ సగం వేల పెట్టుకొమ్మని, వారం లో వాడు 3 రోజులు మా ఇల్లు దూరం కనుక 4 రోజులు నావద్ద ఉండేట్లు . ఒప్పందం కూడా కుదిర్చారు సదరు మాస్టారు . నాకు పుస్తకాలూ చదివినా చదవకపోయినా అట్టలు వేసి సంవత్సరం మొదట్లో ఉన్నట్లు, చివరివరకు ఉంటేనే అదో " తుత్తి" అన్నమాట . అంటే పుస్తకానికి సోల్ ఓనర్ హక్కులు మనకే ఉండాలి . ఏంచేయాలో పాలు పోడం లేదు . నిద్రలో మెలకువలో అదే విషయం మేధోమధనం జరుగుతూంది ... ఎలా ? ఎం ? చేయాలి . అప్పట్లో మానాన్నగారు కొన్ని ప్రతి ష్టంభనల వల్ల , ఉద్యోగ విరామం లో ఉన్నారు . మా అమ్మ జీతమే మా జీవితం . అప్పటికి సగం రేటు గురించిన ఒప్పందం కూడా ,అమ్మకి చెప్పాను . సరే లే నాన్న , డబ్బులు చూసి ఇస్తాను అన్నారు ఆవిడ . దాదాపు ఆ నెల్లో ఐదు,ఆరు సార్లు తనకు మళ్ళీ చెప్పడం జరిగింది . ఒక సమయం లో ఐతే తాను కసిరారు కూడాను . పుస్తకం కొనడం కంటే పుస్తకం మొత్తం నాదిగా ఉండడమే నేను బలం గా కోరుకుంటున్నది . సుబ్బారావు గాడితో షేరు చేసుకోడం సుతారం ఇష్టం లేదు . ఇలాంటి సమయం లో మా ఇంటి దగ్గర్లో ఉన్న ఓ చిన్న పిల్లడు రోజులానే కనిపించాడు .సాధారణం గా ఆ పిల్లాడి దగ్గర రూపాయి , అర్ధ రూపాయి డబ్బులు ఎప్పుడూ కనిపిస్తూ ఉండేవి . కానీ ఆ రోజు ఆ పిల్లాడి చేతిలో 5 రూపాయలనోటు కనిపించింది . నాకు ఎన్నడూ లేని ఆలోచన సుడులు తిరగడం మొదలయ్యింది . ఆ 5 రూపాయలు మనం తీసుకుంటే అన్న ఒక్క ఐడియా నా జీవితం లో గొప్ప పాఠాన్ని నేర్పింది . మరీ చిన్న పిల్లాడవడం చేత వాడికి మాటలు సరిగా వచ్చేవి కావి . వాడి పేరు వాడు చెప్పలేనంత పసివాడు . ఈక్రమం లో నేను, గ్రామర్ పుస్తకం ఓనర్ అయ్యే పధకానికి వాడు" రాజారామ్మోహనరాయ్ "లా కనిపించాడు నాకు . ఎంత యాంగిల్ మార్చి చూస్తున్నప్పటికీ రాజారామ్మోహనరాయ్ లానే ఉన్నాడు నా పాలిట . వాడిని ఉన్నఫళంగా ఎత్తుకుని గాలిలో గిరా గిరా తిప్పి, 5 రూపాయలు నోటు నొక్కేసాను . వాడిని క్రింద ఒదిలి , విజయ గర్వమ్ తో ఓ ANR పాట పాడుకుంటూ నేరుగా" శ్రీ రామ బుక్ డిపో" కు వెళ్ళిపోయాను. అటునుండి అటు స్కూల్ కూ వెళ్ళాను . క్లాసులో టీచర్స్ పీరియడ్ ప్రకారం పాటలు చెబుతన్నా నా ద్రుష్టి నా క్రొత్త పుస్తకం పైనే ఉంది . రేపు ఎంత తొందరగా వస్తుందా? ట్యూషన్ మాస్టారు కి నా క్రొత్త పుస్తకం చూపిస్తానా అన్నదే నా ఆలోచన . పైగా పగటి కలలు (కళ్ళు తెరుచుకుని ). రీసెస్ బిల్లులో 15 నిముషాలు ఎదో ఒక ఆట ఆడుకోడం ఆనవాయితీ . మధ్యతరగతి కంటే పైన ఉండే పిల్లలు , కలిగినోళ్ల పిల్లలు రీ సెస్ బెల్ లో చిరుతిళ్ళు కొనుక్కునేవారు . మా ఇంట్లో ఒక్క పైసా అడిగినా తొక్కి నార తీస్తారు మా అమ్మ . చిరుతిళ్ళు ఒక "వైపు చూసినా "పుంపుహార్ " ఇపోతాం అన్నమాట . అంచేత చిరుతిళ్ళు వైపే చూసే వాడినికాదు . 3.50 పైసలు, ఆపుస్తకం పోను , 1.50 పైసలు జేబులో గలగలా మంటూ సందడి చేస్తూ నన్ను ఐస్ క్రీమ్ తినమని నోరు ఒకటే జిల . ఎప్పుడూ నావనుకున్నవి అంత మొత్తం నా జీవితంలో అప్పటివరకూ లేవు . నా చూపులు ,మాటలూ , యాంగిల్సూ ,కట్టింగ్సూ "వీర పులి " లా మారిపోయ. వెంటనే క్లాస్ మీట్ " హరినారాయణ "ను జత చేసుకుని ఐస్ క్రీం , బిస్క్యూట్స్ తినేసాం . ఇహ జేబులో ఉంది 75 పైసలు . 4 పీరియడ్స్ అయ్యాయి . లాంగ్ బెల్ కొట్టారు . ఎంతో కాన్ఫిడెన్స్ తో ,ఇంటికిచేరుకుంటూ (అమ్మకు నా పుస్తకం గురించి ఇబ్బందిలేదనే సంతోషం తో )..... ఇంటి ఛాయలల్లో నడుస్తూండగా , అమ్మ ! ఎదురు చూస్తున్నట్లు గమనించాను .అంతే ! నా బ్రహ్మానందం సర్వనాశనం అవుతున్నట్లు అనిపిస్తూంది , పైగా ఎడం కన్ను చాలా వేగంగా కొట్టుకోడం మొదలయింది . నాలుక మీద పాట ఎటోవెళ్లిపోయింది , గొంతులో తడి ఆరిపొతోం ది . గుండె అతివేగం గా కొట్టుకుంటూంది . అడుగులో అడుగులేసుకుంటూ ఇంటిమెట్లు ఎక్కాను . అంతే ! ఒక్క రెక్కపుచ్చుకుని మా అమ్మ లాగి ఇంట్లొకివేసుకుని పారిపోకుండా తలుపు గడియ పెట్టింది . నా రెండు చేతులూ వెనుకకు విరిచి చాంతాడు తో గట్టిగా కట్టేసింది . ఇప్పటి మన సంగీత విద్వాంసుడు"శివమణి " , ఆరోజుల్లోనే మా అమ్మను పూనినట్లు గా నన్ను చితకబాదింది దాదాపు 15 నిముషాలు . నేను చెప్పడానికి చాన్సు లేదు . మరోప్రక్క మద్దెలదరువు , ఎలా చచ్చేట్టు . ఎవరైనా రక్షిస్తారోఅన్నా ... ఇంట్లో ఎవ్వరూ లేరు . పైగా మర్దనా జరిగేటప్పుడు ఇంట్లో వాళ్ళు కలగచేసుకుంటే వాళ్ళకీ శిక్షలో "తాయిలం" తప్పనిసరి . నాకేకలు విన్న వెనుక ఇండ్లల్లో ఆంటీ మా తలుపు తీయమని తలుపుకొడుతూఉంది . అప్పటివరకూ నా తుప్పు రేపుతున్న మా అమ్మ "చావు ...చావు వెధవ " " నువ్వు ఛస్తే పీడా విరగడ అవుతుంది ".... అంటూ కొడుతూనేవుంది ....... ఒకప్రక్క వాత లు యెర్రని పొంగులుగా తేలి మంట , నొప్పి .నా ఏడుపు ఎక్కువవుతూనే ఉంది . మా అమ్మ ఒక్కసారిగా తన చేతిలోని బెత్తం తాడూ ఒక ప్రక్క పడేసి తన రెండూ చేతుల్తో నన్ను గట్టిగా తన గుండెలకు హత్తుకుంటూ , తానూ ఎక్కిళ్లుపెడుతూ ఏడ్వడం .... నేను చూస్తూ , మా అమ్మను గట్టిగా పట్టుకుని "అమ్మ ...అమ్మా... ఇంకెప్పుడూ ఇలాంటి పనులు చేయను ".... " నువ్వేడవకు .... ఏడవకే " అంటూ పరస్పరం ఏడిచాము . మనం ఒక తప్పు పనిచేస్తే అది తల్లితండ్రులకు ఎంత ? అవమానాన్ని ... బాధ ... మనోవేదన ను మిగులుస్తుందో ..... వేరేచెప్పక ఆరోజు తెలుసుకున్నాను . మా అమ్మ తాను ఎందుకు ఏడిచిందో జాగ్రత్తగా ఆలోచిస్తే మీరూ అర్ధం చేసుకున్నారు సుమా !
No comments:
Post a Comment